మొరాయిస్తున్న కేటీపీపీ.. తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు

మొరాయిస్తున్న కేటీపీపీ.. తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు
  • బాయిలర్ ట్యూబ్ లీకేజీతో తాజాగా 600 మెగావాట్ల ప్లాంట్ షట్ డౌన్​
  • మార్చిలో 500 మెగావాట్ల  ప్లాంట్ 2 సార్లు ట్రిప్

జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు: కాకతీయ థర్మల్  పవర్​ ప్రాజెక్టు(కేటీపీపీ) తరచూ మొరాయిస్తోంది. ఓవర్​ లోడ్, సాంకేతిక సమస్యలతో కరెంట్  ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. రిపేర్లకు 5 రోజుల సమయం పడుతుండడంతో రూ. కోట్లలో నష్టం వాటిల్లుతోంది. ఈ నెలలోనే మొదటి దశ ప్లాంట్  రెండుసార్లు ట్రిప్​ కాగా. సోమవారం రెండవ దశ 600 మెగావాట్ల ప్లాంట్  బాయిలర్  ట్యూబ్  లీకేజీతో షట్ డౌన్​ చేశారు. 10 రోజుల వ్యవధిలో రెండు ప్లాంట్లు షట్ డౌన్​ కావడంతో కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది.

రిపేర్లకు కోట్లలో ఖర్చు..

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్​లోని కేటీపీపీలో మొదటి దశలో 500 మెగావాట్లు, 2వ దశలో 600 మెగావాట్ల ప్లాంట్లు  రన్​ అవుతున్నాయి. రెండు యూనిట్ల నుంచి 16.4 మిలియన్  యూనిట్ల విద్యుత్​ ఉత్పత్తి అవుతోంది. ఈ నెల20న కేటీపీపీ మొదటి దశ ప్లాంట్ బాయిలర్  ట్యూబ్  లీకేజీతో షట్ డౌన్​ కాగా, 3 రోజుల్లో రిపేర్లు పూర్తి చేసి కరెంట్ ఉత్పత్తి చేపట్టారు. ఇదే ప్లాంట్  ఈ నెలలోనే రెండు సార్లు ట్రిప్  అయింది. సోమవారం రెండో దశ ప్లాంట్  బాయిలర్  ట్యూబ్  లీకేజీతో ప్లాంట్  షట్ డౌన్  చేశారు. రేపటిలోగా ప్లాంట్  రన్ అయ్యేలా రిపేర్లు చేస్తున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు.